శ్రీ రామదూతం శిరసా నమామి!
సముద్రాన్ని సూర్యుడు ఎండ గట్టలేడు, కానీ అదే భానుడు పిల్లకాలువను ఆనవాలు లేకుండా అలవోకగా అంబరానికెత్తుకోగలడు. అలాగే నా ఓపిక మొత్తం నేను ఇవ్వకపోయినా ఆవిరి చేసే నా కంప్యూటర్ కి హవిస్సుగా ఆహుతి చేసి(ఈ అనంత విశ్వం లో నాకు తెలిసి ఎయిర్ కండిషన్ లో ఉంటూ జనాల జవసత్వాలను ఆవిరి చేసే సూర్య సదృశం ఈ కంప్యూటర్ ఒక్కటే ), అర్ధ ప్రధానమైన ఆ నిత్య యజ్ఞకర్మకి పూర్ణాహుతి చేసి ,ఓ శనివారం నాతో నేను (అంతే కదా మరి ) కలిసి నడుచుకుంటూ వస్తున్నాను.దారిలో పూణే గోల్ఫ్ కోర్స్ లో పెన్సిల్ కూడా సరిగ్గా పట్టుకోలేని పిల్లలు గోల్ఫ్ బాల్స్ తో కుస్తీ పడుతున్నారు(గోల్ఫ్ లో వాడే బాట్ లాంటి సాధనాన్ని ఏమంటారో నాకు తెలియదు మరి). ఓ పావుగంట చూసాను,సరే అక్కడినుండి కదిలి ముందుకు పోయాను.కొంచేపు పోయేసరికి ఇక నడవలేము అనిపించింది.వందేళ్ళు భగవంతుడి గురించిన ధ్యాస కానీ,అవసరం కానీ లేకుండా గడిపెయ్యచ్చనుకుంటాం. కానీ అలసట లేకుండా పది నిముషాలు పైబడి నడవలేము కదా.సరే ఒక ఆటో పట్టుకుని రూం కి వెళ్తూ మధ్యలో మోర్ లో వారాంతం కదా ఏమన్నా కొందామని వెళ్ళ్ళాను. (ఏంటి ఈ సోది టైటిల్ కి రాడేంటి అనుకుంటున్నారా, వస్తున్నా )
మోర్ లోనుండి బయటకి వచ్చి నడుస్తున్నాను. ఇంకొక్క నూటయాభై అడుగులు నడిస్తే మా అపార్ట్ మెంట్ ద్వారం వస్తుంది.సరే నేనేదో ఆలోచించుకుంటూ నడుస్తున్నాను.అప్పుడు ఒక అమ్మాయి సడెన్ గా ధర్మ మోక్షాలను , అర్ధ కామాలు క్రాస్ చేసినట్టు నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోయింది(:-)). అలా సడెన్ గా దాటిపోయేసరికి చివ్వున తలెత్తి చూసాను,
నలుపు ,తెలుపు పంజాబీ డ్రెస్ వేసుకుని వుంది, చాలా వేగంగా నడుస్తుంది, ఏం అవసరం లో పరిగెడుతుందో లే అనుకున్నాను. ఆమె నుండి చూపు తిప్పుకుంటుండగా ఆమె చెవి కమ్మలు కనబడ్డాయి. రెండు,మూడు చిన్న చైన్లు కిందకి వచ్చి కింద మరొక్క చాలా చిన్న లాకెట్ లాంటి దానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఆ చెవి కమ్మలు ఆ అమ్మాయి నడుస్తున్న వేగానికి సెకండ్ల లోలకం కంటే ఎక్కువ వేగం తో(హై స్కూల్ ఫిజిక్స్- సెకండ్ల లోలకం అవధి-2 సెకండ్లు , తప్పైతే ఆదిలక్ష్మి గారు కరెక్ట్ చెయ్యాలి) ఆమె బుగ్గలనందుకోవాలని ప్రయత్నించి అందుకోలేక వెనక్కి వచ్చి జడకి చెప్పుకుంటున్నాయి.
అలా కదులుతున్న చెవి కమ్మలను చూడగానే నాకు అనుకోకుండా "తాటంకా చలనమ్ముతో,భుజ నటద్ధమ్మిల్ల బంధమ్ముతో......" అనే పద్యం గుర్తొచ్చింది.
గజేంద్రుడు పిలిచాడు బాగానే ఉంది,అయ్యవారు అన్నీ మరిచి పరిగెడుతున్నారు బాగానే ఉంది, కానీ మధ్యలో అమ్మవారి చీరచెంగు చేతిలో ఉన్న విషయం కూడా మర్చిపోయి పరిగెడుతున్నారు స్వామి.లక్ష్మీ దేవి మాత్రం ఏమి చేస్తుంది,ఏం చెప్తుంది? ఆగమంటే అదో అపకీర్తి- భక్తులకి , భగవంతుడికి మధ్య లక్ష్మీ దేవి అడ్డొచ్చిందంటారో ఏమో ,లోకాలను కాపాడడానికి మొగుడు విషం తాగుతుంటే ఏమీ కాదని తెలిసి తాగమన్నందుకే పార్వతీ దేవిని నిందిస్తున్నారు(మింగెడిది గరళమని, మింగెడివాడు విభుండని,మింగమనె సర్వమంగళ) హవ్వ మొగుడిని విషం తాగమంటుందా ఏ భార్య ఐనా అని. అలాంటిది ఆపి "ఏమయ్య ఎక్కడికి పరిగెడుతున్నావు పెళ్ళాన్ని కూడా మర్చిపోయి " అంటే ఇంకేమన్నా ఉందా , ఇలా అలోచిస్తూ అమ్మవారు తత్తరపాటుతో ఆ లోకేశుని అనుసరిస్తున్నప్పుడు అమ్మవారి స్థితి ని వర్ణించిన పోతనామాత్య కృత పద్యరత్నం అది.పరిగెడుతున్న వేగానికి కదులుతున్న అమ్మవారి తాటంకాలు ఎలా కదిలి ఉంటాయో ఎందుకు పోతన చెవి కమ్మలు కదిలితే అంత ప్రాముఖ్యత ఇచ్చాడో అని చాలా సార్లు అనుకున్నాను గజేంద్రమోక్షణ కధ చదివిన దగ్గరనుండి. కానీ ఆ అమ్మలగన్న యమ్మ ఇలా దృశ్యరూపంగా ఆ ఘట్టాన్ని ఆవిష్కరిస్తుందనుకోలేదు.ఎవరైనా ఆడవారి మొఖం చూసినప్పుడు చాలా తొందరగా కదులుతూ చూపునాకర్షించేవి తాటంకాలే, పరుగులు పెడుతున్న అమ్మవారిని ధ్యానంలో దర్శనం చేసిన పోతన కి కూడా ఆ తాటంకాలే కనపడి ఉంటాయి ముందు. అందుకే ఆ తాటంకా చలనమే ముందుండి ఆ పద్యాన్ని నడిపించింది.(సౌందర్య లహరిలో శంకరులు కూడా పార్వతి దేవి తాటంకాలపై ఒక పద్యం రాసినట్టు గుర్తు.)
ఆ పద్యంలో మొదటి పదమైన "తాటంకా చలనమ్ముతో" అన్న స్థితి నా కళ్ళముందు సాక్షాత్కరించినట్లైంది. ఒక్క సారి గజేంద్రుడి పటాటోపం,
సత్వరజస్తమో గుణ సదృశమైన త్రికూటాచలమూ,
మొసలి పరాక్రమమూ
(పాద ద్వందము నేలమోపి, పవనుం బంధించి ,పంచేంద్రియోన్మాదంబుం పరిమార్చి, బుద్ధిలతకున్మారాకు హత్తించి, నిష్ఖేద బ్రహ్మపదావలంబన గతిం క్రీడించు యోగీంద్రు మర్యాద -నక్రము విక్రమించె కరి పాదాక్రాంత నిర్వక్రమై),
తీసిపోని గజరాజు పరాక్రమమూ
(జవమును,జలమును,బలమును వివిధములుగ కరటి వీరతకు భువిన్, దివి మకర మీన కర్కట నివహంబులొక్కటన మిత్ర నిలయము బొందెన్),
వెయ్యి సంవత్సరాలు జరిగిన అద్వితీయమైన పోరాటమూ(సలిపె పోరొక్క వేయి సంవత్సరముల్),
చేష్టలుడిగి శరణాగతి చేసిన ఏనుగు(లావొక్కింతయు లేదు....) ,
పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడిన శ్రీ మహా విష్ణువు(సిరికించెప్పడు...,కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా బంపె....,పూరించెన్ హరి పాంచజన్యము...),
శాపవిముక్తుడైన గందర్వుడు హూహూ,
విష్ణువులో ఐక్యత నొందిన ఇంద్రద్యుమ్న మహారాజు,
శుక బ్రహ్మ చెప్పిన ఫలశ్రుతీ,
శ్రీ మహా విష్ణువు చేసిన అభయ ప్రదానం,
పోతన చెప్పిన ఫలశ్రుతీ --ఇలా అన్నీ కళ్ళముందు గిర్రున తిరిగాయి. తేరుకుని చూస్తే అమ్మాయి లేదు, కానీ ఆ కదులుతున్న చెవి కమ్మలు మాత్రం గుర్తుండిపోయాయి.
కొని వారమైంది ,కార్తీక మాసం సగమైపోయింది వీడింకెప్పుడు మొదలుపెడతాడో భాగవతం, ఒక పక్క కార్తీక పౌర్ణమి కూడా దాటిపోతుంది అని (ఆరోజు అయ్యవారు పరిగెత్తి గజేంద్రుడిని కాపాడినట్టు) నా చేత కార్తీక పౌర్ణమి లోపు భాగవత పఠనం మొదలుపెట్టించడానికి అంతే తత్తరపాటుతో పరిగెత్తుకొచ్చిందేమొ ఆ అమ్మ అని అనిపించింది(నాటికి రెండవరోజు కార్తీక పౌర్ణమి)
ఏమిటీ దైవలీల,
మంగళాశాసన పదైః మదాచార్య పురోగమైః!
సర్వైశ్చపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం
Showing posts with label పోతన. Show all posts
Showing posts with label పోతన. Show all posts
Sunday, November 8, 2009
Friday, October 9, 2009
నేనూ ఒక పద్యం రాసానోచ్.
శ్రీ రామదూతం శిరసా నమామి.
గజేంద్ర మోక్షం చదివిన తర్వాత నాకు కూడా ఆంజనేయస్వామి మీద ఒక పద్యం రాయలనిపించింది. మత్తేభమో, శార్దూలమో, చంపకమో, ఉత్పలమో కొడదాం అనుకున్నా
*ఫర్ క్విక్ రిఫరెన్స్
ఉత్పలమాల-భ ర న భ భ ర వ
చంపకమాల-న జ భ జ జ జ ర
మత్తేభం-స భ ర న మ య వ
శార్దూలం- మ స జ స త త గ (ఆటవెలది,తేటగీతి, కందం- పేర్లు మాత్రమే తెలుసు చందస్సు తెలియదు.). *
సరే కాన్సెప్ట్ కావాలి కదా... తీవ్రంగా బ్రైన్ ని ఆ భగవంతుడి గుణగణాల మీద కేంద్రీకరించి అలోచించాక నాకు తట్టిన మొదటి అలోచన ఆ రామదూత కు పెద తండ్రి అయిన యముడి విషయం. తదుపరి గుర్తొచ్చింది ఎవరినైనా ముంచగలిగిన సంసారమనే మృత్యుసాగరాన్ని అవలీలగా దాటిన విషయం. దాంతో దీన్నే పద్యంగా రాద్దాం అనుకున్నా. కాని ఇక్కడ ఒక చిక్కు వచ్చింది.యముడు హనుమ కి పెద నాన్న అయినది ద్వాపరంలో, కానీ సాగరాన్ని దాటింది త్రేతాయుగం లో. దానితో ఎలా రాయడమా అని తెగ అలోచించాను. ఏమీ తోచలేదు. నేనేమన్నా సహజ పాండితీ ప్రకర్ష ఉన్న పొతన్ననా, మామూలు పదాలతోనే పెద్ద పెద్ద పద్యాలు రాసెయ్యడానికి(జో జో కమలదలేక్షణ, జో జో మృగరాజ నయన జో జో-దశమ స్కంధం), లేకపోతె అజ్జాడ గారిలాగా సమయ స్పూర్తి ఉన్నవాడినా,(రాజుతో పేకాట ఆడుతూ రాజుకు మూడు ఆసులు , తనకు మూడు రాజులు వస్తే, పెద్ద పందెం పెట్టేసి ఆనక "ఏ ధైర్యం తో అంత పందెం పెట్టావంటే" రాజుల మీద నమ్మకంతో అని ఎస్కేప్ అయినట్టు అవ్వడానికి)
అందుచేత చివరికి నేను కూడా అర్జునుని బాణాన్నే నమ్ముకుని - పద్యం తెలిసిన వాళ్ళకి కవిత అని, తెలియని మా అశోక్, శశాంక్, అభి, కిరణ్(కిరణ్ కి కొంచెం తెలుసనుకుంటా),రెక్కల పక్షి(వింగ్ బర్డ్-వెంకట్)కి ఏ కందమో, ఆటవెలదో, తేటగీతో అని చెప్పెయ్యచ్చులే అని ఒక పద్యం రాసేసా.
ఇదుగో ---
సర్వతముడవు,సర్వోత్తముడవు
సర్వాత్ముడవు,సర్వము నీవై యుండన్
సర్వకాలములందు నమస్కరింతు
సర్వం సహా చక్రవర్తికి సరసీరుహాళికిన్
ఏంటి ఎక్కడో చదివినట్టు ఉందా (1-విశ్వకరు,విశ్వదూరుని,విశ్వాత్ము,విశ్వవేద్యు విశ్వునవిశ్వున్ శాశ్వతనజు బ్రహ్మ ప్రభు నీశ్వరునిన్ బరమ పురుషు నే సేవింతున్ 2-లోకంబులు లోకేశులు లోకస్ధులు దెగిన దుది నలోకంబగు పెంజీకటికవ్వలనెవ్వడేకాకృతి వెలుగుచునుండునాతని సేవింతున్ ... ఇలా ), ఒక వేళ మీరెక్కడన్న చదివినా అది నా తప్పు కాదు. ఎందుకంటే ఇది నా సొంతం......(ఏంటీ స్వామి నవ్వుతున్నావా నా సొంతమన్నానని-అంతేలే ఎందుకు నవ్వవు, గ్రామర్ పెద్దగా తెలియని నాకు ఒక పద్యం రాయాలని కోరిక కలిగించి చివరికి నేను రాయలేకపోతే నిరుత్సాహ పడకూడదని ఒక చిన్న పద్యం రాసేలా చేస్తే ఇప్పుడు నేను ఈ పద్యం నాదే అంటే నవ్వు రాదా).
నాది అని అన్నందుకు క్షమించు స్వామీ కానీ అలా అనడానికి కారణం ఉంది, అలా అనుకోకపోతే నీకు నైవేద్యంగా సమర్పిన్చుకోలేనన్న చిన్న ఆలోచన . అందుకే ఈ చిన్న ధిక్కారం.
కూర్చె భాగవతమొకరు నిను సేవించి కైవల్యమొంద,
తీర్చుకొనుటకు జన్మ జన్మంబుల కర్మ పాశములు కొంద
రర్చించె శతకములతో,అల్ప జ్ఞాన వశమున నే
కూర్చిన ఈ పదమాలనర్చించనిమ్ము నీ పాద పద్మంబుల
నా మొదటి పద్యం(సర్వతముడవు...) ఆ శ్రీ రామదూతకి అంకితమిస్తూ.......
శ్రీ రామదూతం శిరసా నమామి....
మంగళాశాసన పదైః మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం
గజేంద్ర మోక్షం చదివిన తర్వాత నాకు కూడా ఆంజనేయస్వామి మీద ఒక పద్యం రాయలనిపించింది. మత్తేభమో, శార్దూలమో, చంపకమో, ఉత్పలమో కొడదాం అనుకున్నా
*ఫర్ క్విక్ రిఫరెన్స్
ఉత్పలమాల-భ ర న భ భ ర వ
చంపకమాల-న జ భ జ జ జ ర
మత్తేభం-స భ ర న మ య వ
శార్దూలం- మ స జ స త త గ (ఆటవెలది,తేటగీతి, కందం- పేర్లు మాత్రమే తెలుసు చందస్సు తెలియదు.). *
సరే కాన్సెప్ట్ కావాలి కదా... తీవ్రంగా బ్రైన్ ని ఆ భగవంతుడి గుణగణాల మీద కేంద్రీకరించి అలోచించాక నాకు తట్టిన మొదటి అలోచన ఆ రామదూత కు పెద తండ్రి అయిన యముడి విషయం. తదుపరి గుర్తొచ్చింది ఎవరినైనా ముంచగలిగిన సంసారమనే మృత్యుసాగరాన్ని అవలీలగా దాటిన విషయం. దాంతో దీన్నే పద్యంగా రాద్దాం అనుకున్నా. కాని ఇక్కడ ఒక చిక్కు వచ్చింది.యముడు హనుమ కి పెద నాన్న అయినది ద్వాపరంలో, కానీ సాగరాన్ని దాటింది త్రేతాయుగం లో. దానితో ఎలా రాయడమా అని తెగ అలోచించాను. ఏమీ తోచలేదు. నేనేమన్నా సహజ పాండితీ ప్రకర్ష ఉన్న పొతన్ననా, మామూలు పదాలతోనే పెద్ద పెద్ద పద్యాలు రాసెయ్యడానికి(జో జో కమలదలేక్షణ, జో జో మృగరాజ నయన జో జో-దశమ స్కంధం), లేకపోతె అజ్జాడ గారిలాగా సమయ స్పూర్తి ఉన్నవాడినా,(రాజుతో పేకాట ఆడుతూ రాజుకు మూడు ఆసులు , తనకు మూడు రాజులు వస్తే, పెద్ద పందెం పెట్టేసి ఆనక "ఏ ధైర్యం తో అంత పందెం పెట్టావంటే" రాజుల మీద నమ్మకంతో అని ఎస్కేప్ అయినట్టు అవ్వడానికి)
అందుచేత చివరికి నేను కూడా అర్జునుని బాణాన్నే నమ్ముకుని - పద్యం తెలిసిన వాళ్ళకి కవిత అని, తెలియని మా అశోక్, శశాంక్, అభి, కిరణ్(కిరణ్ కి కొంచెం తెలుసనుకుంటా),రెక్కల పక్షి(వింగ్ బర్డ్-వెంకట్)కి ఏ కందమో, ఆటవెలదో, తేటగీతో అని చెప్పెయ్యచ్చులే అని ఒక పద్యం రాసేసా.
ఇదుగో ---
సర్వతముడవు,సర్వోత్తముడవు
సర్వాత్ముడవు,సర్వము నీవై యుండన్
సర్వకాలములందు నమస్కరింతు
సర్వం సహా చక్రవర్తికి సరసీరుహాళికిన్
ఏంటి ఎక్కడో చదివినట్టు ఉందా (1-విశ్వకరు,విశ్వదూరుని,విశ్వాత్ము,విశ్వవేద్యు విశ్వునవిశ్వున్ శాశ్వతనజు బ్రహ్మ ప్రభు నీశ్వరునిన్ బరమ పురుషు నే సేవింతున్ 2-లోకంబులు లోకేశులు లోకస్ధులు దెగిన దుది నలోకంబగు పెంజీకటికవ్వలనెవ్వడేకాకృతి వెలుగుచునుండునాతని సేవింతున్ ... ఇలా ), ఒక వేళ మీరెక్కడన్న చదివినా అది నా తప్పు కాదు. ఎందుకంటే ఇది నా సొంతం......(ఏంటీ స్వామి నవ్వుతున్నావా నా సొంతమన్నానని-అంతేలే ఎందుకు నవ్వవు, గ్రామర్ పెద్దగా తెలియని నాకు ఒక పద్యం రాయాలని కోరిక కలిగించి చివరికి నేను రాయలేకపోతే నిరుత్సాహ పడకూడదని ఒక చిన్న పద్యం రాసేలా చేస్తే ఇప్పుడు నేను ఈ పద్యం నాదే అంటే నవ్వు రాదా).
నాది అని అన్నందుకు క్షమించు స్వామీ కానీ అలా అనడానికి కారణం ఉంది, అలా అనుకోకపోతే నీకు నైవేద్యంగా సమర్పిన్చుకోలేనన్న చిన్న ఆలోచన . అందుకే ఈ చిన్న ధిక్కారం.
కూర్చె భాగవతమొకరు నిను సేవించి కైవల్యమొంద,
తీర్చుకొనుటకు జన్మ జన్మంబుల కర్మ పాశములు కొంద
రర్చించె శతకములతో,అల్ప జ్ఞాన వశమున నే
కూర్చిన ఈ పదమాలనర్చించనిమ్ము నీ పాద పద్మంబుల
నా మొదటి పద్యం(సర్వతముడవు...) ఆ శ్రీ రామదూతకి అంకితమిస్తూ.......
శ్రీ రామదూతం శిరసా నమామి....
మంగళాశాసన పదైః మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం
Subscribe to:
Posts (Atom)


